భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టెస్ట్ నేడు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకూ జరిగిన రెండు టెస్టులలోనూ పరాజయం పాలైన భారత్ ఇప్పటికే సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. నామమాత్రమైన ఈ మూడో టెస్ట్ లోనైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని కోహ్లీ సేన భావిస్తుండగా.. వైట్ వాష్ చేయాలని సఫారీ ఉత్సాహంతో ఉంది.
మూడో టెస్ట్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టు విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న కెప్టెన్ కోహ్లీ.. ఈ మ్యాచ్కు కూడా రెండు కీలక మార్పులు చేశాడు. రోహిత్శర్మ స్థానంలో అజింక్య రహానే, అశ్విన్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ టీమ్లోకి వచ్చారు. ఈ లెక్కన పాండ్యాతో కలిపి ఐదుగురు పేస్బౌలర్లతో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతుండటం విశేషం. అటు సౌతాఫ్రికా కూడా స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగుతున్నది. కేశవ్ మహరాజ్ను పక్కనపెట్టి పెహ్లుక్వాయోను టీమ్లోకి తీసుకుంది.