జొహెన్నెస్బర్గ్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 247 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 49/1తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోచి కష్టాల్లో పడింది. స్కోరు బోర్డుపై మరో రెండు పరుగులు చేరగానే ఓపెనర్ కేఎల్ రాహుల్ (16) అవుటయ్యాడు. అనంతరం క్రీజ్లో వచ్చిన పుజారా కూడా ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లి (41), విజయ్తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. స్కోర్ 100 పరుగులకు చేరగానే విజయ్ (25) అవుటయ్యాడు. దీంతో తొలి సెషన్లోనే భారత్ మూడు వికెట్లను కోల్పోయింది.
అజింక్య రహానే.. కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపాడు. 41 పరుగుల వద్ద కోహ్లి అవుటయ్యాడు. హార్దిక్ మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. వెంటనే హార్దిక్ పాండ్యా(4) కూడా నిష్క్రమించడంతో భారత జట్టు రెండొందల పరుగులు చేయడం కష్టంగా అనిపించింది. రహానే, భువీ కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ ఏడో వికెట్కు 55 పరుగులు జోడించారు. వేగంగా ఆడిన రహానే (48) కొద్దిలో అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు.
రహానే అవుటైనప్పటికీ.. షమీ, భువీ వేగంగా పరుగులు రాబట్టారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు 35 పరుగులు జోడించారు. షమీ (28 బంతుల్లో 27; 1×4, 2×6) వేగంగా ఆడాడు. 76 బంతులు ఎదుర్కొన్న భువనేశ్వర్ కుమార్ మోర్కెట్ బౌలింగ్లో 9వ వికెట్గా వెనుదిరిగాడు. మరికాసేపటికే బుమ్రా (0) అవుటవడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది.
సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, మోర్కెల్, ఫిలాండర్లకు తలో మూడు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్లో సఫారీ జట్టుకు 7 పరుగుల ఆధిక్యం ఉండటంతో విజయం కోసం ఆ జట్టు 241 పరుగులు చేయాల్సి ఉంటుంది. 241 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో సపారీ జట్టు మొదట్లోనే మాక్రమ్ వికెట్ కోల్పోయింది. క్రీజ్లో ఎల్గర్ (2), అమ్లా ఉన్నారు.