భారత్-దక్షిణాఫ్రికా మధ్య సహారా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే మిగితా ఆటగాళ్లు మాత్రం ఒకొరి వెంట మరొకరు వరుసకట్టి డ్రెస్సింగ్ రూం బాటపడుతున్నారు. రెండో వికెట్గా క్రీజ్లోకి వచ్చిన డుప్లెసిస్ భారత బౌలింగ్ని ధీటుగా ఎదురుకుంటూ మైదానంలో పరుగుల వరద పారించాడు. ఈ నేపథ్యంలో 58 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులు చేసిన డుప్లెసిస్ తన వన్డే కెరీర్లో 30వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్ మినహా మిగితా ఆటగాళ్లు రాణించలేకపోతున్నారు. కుల్పీద్ వేసిన 25.5 ఓవర్కి డుమినీ క్లీన్ బౌల్డ్ కాగా.. మిల్లర్ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి మళ్లీ కుల్దీప్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 30 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజ్లో డుప్లెసిస్(77), మోరిస్(21) ఉన్నారు.
అంతకు ముందు ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(16), డీ కాక్(34) వికెట్లను కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో భాగంగా 15 ఓవర్లో డీకాక్ రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. భారత స్పిన్నర యజ్వేంద్ర చాహల్ బౌలింగ్లో డీ కాక్ ఎల్బీగా అవుటయ్యాడు. అంతకుముందు హషీమ్ ఆమ్లా సైతం ఎల్బీగానే పెవిలియన్ చేరాడు. ఈ ఇద్దరూ వికెట్లు ముందు దొరికిపోవడం గమనార్హం. బూమ్రా వేసిన ఎనిమిదో ఓవర్ మూడో బంతికి ఆమ్లా ఎల్బీగా పెవిలియన్ చేరగా, ఆపై మరో ఏడు ఓవర్ల వ్యవధిలో డీ కాక్ కూడా పెవిలియన్కు చేరాడు.