చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చేదువార్త. చెపాక్ స్టేడియం నుంచి ఐపీఎల్ మ్యాచ్లను తరలించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కావేరీ వివాదం నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లను చెన్నై నుంచి మరో వేదికకు తరలించాల్సిందిగా బీసీసీఐ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి సూచించింది. ప్రత్యామ్నాయంగా నాలుగు నగరాల పేర్లను చెన్నై టీమ్ ముందు ఉంచినట్లు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు.
వీటిలో ఏపీలోని విశాఖపట్నంతోపాటు త్రివేండ్రం, పుణె, రాజ్కోట్ ఉన్నాయి. అయితే వీటిలోనూ విశాఖపట్నం ముందు వరసలో ఉన్నట్లు సమాచారం. చెన్నై, కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగానూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితు నెలకొన్న విషయం తెలిసిందే. నిజానికి అసలు చెన్నైలో ఐపీఎల్ నిర్వహించకూడదని ముందే కొన్ని గ్రూపులు హెచ్చరించాయి. అయినా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి మ్యాచ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు స్టేడియం బయట, లోపల నిరసన తెలిపారు. చెన్నై ప్లేయర్ జడేజాపై బూటు కూడా విసిరారు. దీంతో వేదికను తరలించడమే ఉత్తమమని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. చెన్నైలో పరిస్థితులు మ్యాచ్లకు అనుకూలంగా లేవు కాబట్టే తాము ఇతర వేదికలను చూస్తున్నట్లు వినోద్ రాయ్ స్పష్టంచేశారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెన్నై సూపర్కింగ్స్ ఫ్రాంచైజీకి కూడా చెప్పినట్లు ఆయన తెలిపారు.