వరుస ఓటములతో విలవిల్లాడుతున్న ఆర్సీబీ ఎట్టకేలకు విజయం సాధించింది. వరు ఓటములతో డీలా పడ్డ జట్టు గెలుపు రుచిని చూసింది. శనివారం స్థానిక ఐఎస్ బింద్రా మైదానంలో కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.
పరాజయాలతో ఢీలాపడిపోయిన విరాట్ కోహ్లీ ముఖంలో తొలిసారి ఆనందం కనిపించింది. మ్యాచ్ విజయం తర్వాత అతను గాల్లోకి పంచ్లు విసురుతూ చేసుకున్న సంబరాలు చూస్తె గెలుపు కోసం ఎంత తపించిపోయాడో అర్ధం చేసుకోవచ్చు.
కింగ్స్ పంజాబ్ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని.. 19.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సారథి విరాట్ కోహ్లి(67;53 బంతుల్లో 8ఫోర్లు), డివిలియర్స్(59 నాటౌట్; 38 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లు)లు బాధ్యతాయుతంగా ఆడగా.. చివర్లో స్టొయినిస్(28నాటౌట్; 16 బంతుల్లో 4ఫోర్లు) రాణించాడు
బెంగళూరు విజయంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఏబీ డివిలియర్స్కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా.. గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసిన తర్వాత ఏబీ డివిలియర్స్ తన వద్దకి వచ్చిన కోహ్లీతో ‘ఏం తమ్ముడూ ఇప్పుడు సంతోషమేనా..? అన్నట్లు చూడటం కనిపించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ గేల్(99 నాటౌట్; 64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) కడవరకూ క్రీజ్లో ఉండటంతో కింగ్స్ పంజాబ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్-క్రిస్ గేల్లు మొదటి వికెట్కు 66 పరుగులు జోడించిన తర్వాత రాహుల్(18) ఔటయ్యాడు.
మయాంక్ అగర్వాల్(15),సర్ఫరాజ్ ఖాన్(15)లు నిరాశపరిచారు. కాగా, గేల్ ఒంటరి పోరాటం చేసి జట్టు స్కోరును చక్కదిద్దాడు. దాంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చహల్ రెండు వికెట్లు సాధించగా, సిరాజ్, మొయిన్ అలీలు తలో వికెట్ తీశారు.