ఒకప్పుడు ఒలింపిక్ పతక విజేతగా, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న సిక్కోలు బిడ్డ కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా తెలుగు బిడ్డ వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమిస్తూ.. ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది.
ఈ మేరకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రీడా విశ్వవిద్యాలయానికి కరణం మల్లీశ్వరి మొట్టమొదటి వీసీ అవుతారని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. త్వరలోనే ఈ నియామకానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తామని వివరించారు. ఇటీవల స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి చెబుతూ, క్రీడాకారులు ఇకపై ఇక్కడ తాము ఎంచుకున్న క్రీడాంశంలో డిగ్రీ పొందవచ్చని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు. వారు ఇతరత్రా మరే డిగ్రీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఇక పదేళ్ల తర్వాత జరిగే ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కనీసం 50 పతకాలు సాధించాలనే లక్ష్యంతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడారంగంలో దేశాన్ని గర్వించేలా చేస్తుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
నేటి పంచాంగం,బుధవారం(23-06-2021)