ఐపీఎల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఐపీఎల్ 2018 సీజన్ లో ఇండోర్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్టు అవలీలగా ఛేదించి.. విజయాన్ని సొంతం చేసుకుంది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 174 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (57), హిట్టర్ క్రునాల్ పాండ్యా (31 నాటౌట్) లు చెలరేగి ఆడటంతో ముంబై ఇండియన్స్ విజయ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.
అంతకు ముందు బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కింగ్స్ పంజాబ్ తొలి వికెట్కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత కేఎల్ రాహుల్(24) వికెట్ను కోల్పోయింది. గేల్ హాఫ్ సెంచరీ సాధించి స్కోరు బోర్డును చక్కదిద్దాడు. కింగ్స్ పంజాబ్ 84 పరుగుల వద్ద రెండో వికెట్ను నష్టపోయింది.
తర్వాత కాసేపటికి యువరాజ్ సింగ్(14) మూడో వికెట్గా ఔటయ్యాడు. ఇక కరుణ్ నాయర్(23) ఎక్కువ సేపు క్రీజ్లో నిలవలేకపోవడంతో కింగ్స్ పంజాబ్ 134 పరుగుల వద్ద నాల్గో వికెట్ను కోల్పోయింది. చివర్లో మయాంక్ అగర్వాల్(11),అక్షర్ పటేల్(13)లు నిరాశపరచగా, స్టోయినిస్(29 నాటౌట్;15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది.