భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన చెత్త రికార్డుని మరింత పదిలం చేసుకున్నాడు దక్షిణాఫ్రికా పర్యటనలో పేలవ ఫామ్తో సతమతమైన రోహిత్ తాజా ట్రైసిరీస్లో సైతం దారుణంగా విఫలమయ్యాడు. నిదహాస్ ట్రోఫీలో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగిన రోహిత్ గత ఐదేళ్లలో అత్యధిక డకౌట్లు అయిన భారత ఆటగాడిగా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఇప్పటికే టీ20 క్రికెట్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక సార్లు డకౌటైన క్రికెటర్గా రికార్డుల్లో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ శర్మ.. మంగళవారం రాత్రి ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా శ్రీలంకతో ముగిసిన తొలి టీ20లోనూ డకౌటయ్యాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే చమీరా బౌలింగ్లో రోహిత్ శర్మ (0: 4 బంతుల్లో) ఫీల్డర్ తలమీదుగా బంతిని బౌండరీకి తరలించబోయి మెండిస్కి దొరికిపోయాడు. ఈ మ్యాచ్లో భారత్పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
భారత్ తరఫున ఇప్పటి వరకు 75 టీ20 మ్యాచ్లాడిన రోహిత్ శర్మ ఏకంగా ఐదుసార్లు డకౌట్గా వెనుదిరిగాడు. అతని తర్వాత స్థానంలో ఆశిష్ నెహ్రా మూడు సార్లు, యూసఫ్ పఠాన్ మూడు సార్లు, గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా రెండేసి సార్లు పరుగులేమీ చేయకుండానే టీ20ల్లో ఔటయ్యారు. శ్రీలంక గడ్డపై రోహిత్ చెత్త ఫామ్ కొనసాగుతోంది.
దక్షిణాఫ్రికా పర్యటనలో విఫలమైనా.. తాజా సిరీస్లో రాణిస్తాడని ఎదురు చూసిన అభిమానులకు రోహిత్ నుంచి నిరాశే ఎదురైంది. ఇక తొలి మ్యాచ్లో భారత్పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గురువారం బంగ్లాదేశ్తో భారత్ రెండో టీ20 ఆడనుంది.