నిదహస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్ అనంతరం చోటు చేసుకున్న విధ్వంస ఘటనపై నివేదిక వెలువడింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఈ ఘటనకు కారణమని తేలింది. డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు పగిలిపోయిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన మ్యాచ్ రిఫెరీ క్రిస్ బ్రాడ్.. మైదాన సిబ్బందిని విచారణ చేపట్టారు.
ఈ విజయంతో మైదానంలో హద్దులు మీరి సంబరాలు చేసుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్లు.. డ్రెస్సింగ్ రూముకి వెళ్లి అక్కడ అద్దాన్ని పగలగొట్టారు. అయితే.. ఈ అద్దాన్ని ఎవరు పగలగొట్టారు..? అనేదానిపై మాత్రం స్పష్టమైన ఆధారాలు లభించలేదు. కానీ.. బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ బ్యాట్తో ఆ అద్దాన్ని బద్దలుకొట్టినట్లు ఆటగాళ్లకి ఫుడ్ సరఫరా చేసిన సిబ్బంది చెప్పినట్లు శ్రీలంక మీడియా వార్తలు రాస్తోంది.
అయితే బంగ్లా ఆటగాళ్లు విజయోత్సాహం వేడుకలు నిర్వహించుకున్న క్రమంలోనే ఈ ఘటన జరిగిందని.. దీని వెనుక శ్రీలంక అభిమానులు ఉన్నారన్న రీతిలో వెలువడ్డ అభూత కల్పన కథనాలను క్రిస్ బ్రాడ్ ఖండించినట్లు ఆ కథనం ఉటంకించింది.
షకిబ్పై ఎలాంటి వీడియో సాక్ష్యాలు లభించకపోవడంతో.. షకిబ్పై ఐసీసీ చర్యలు తీసుకోలేకపోయింది. కానీ.. మైదానంలో అనుచిత ప్రవర్తనకి మాత్రం మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది.