కెప్టెన్సీ మార్పు ఢిల్లీ డేర్డెవిల్స్కు అదృష్టం తెచ్చిపెట్టినట్లుంది. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ జట్టుకు ఎట్టకేలకు ఊరట లభించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 55 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్పై ఘన విజయం సాధించింది.
కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (93 నాటౌట్: 40 బంతుల్లో 3×4, 10×6), యువ ఓపెనర్ పృథ్వీ షా (62: 44 బంతుల్లో 7×4, 2×6) దూకుడుగా ఆడటంతో తొలుత 219 పరుగుల భారీ స్కోరు చేసిన ఢిల్లీ జట్టు.. అనంతరం ఛేదనలో కోల్కతా నైట్రైడర్స్ని 164/9కే పరిమితం చేసి 55 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
అయితే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా తొలి మ్యాచ్లోనేఅ య్యర్ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్లో కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 40 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 93 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్గా వ్యహరించిన తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించిన నాల్గో క్రికెటర్గా అయ్యర్ నిలిచాడు.
అంతకుముందు 2008లో గిల్ క్రిస్ట్(డెక్కన్ చార్జర్స్), 2013లో అరోన్ ఫించ్(పుణె వారియర్స్), 2016లో మురళీ విజయ్(కింగ్స్ పంజాబ్)లు కెప్టెన్లుగా వ్యవహరించిన తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీలు సాధించిన క్రికెటర్లు. కాగా, కెప్టెన్లుగా వ్యవహరించిన తొలి మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును అయ్యర్ సాధించడం ఇక్కడ మరో విశేషం.