వెస్టిండిస్.. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను శాసించిన జట్టు. కాని ఈ మధ్యకాలంలో ఈ జట్టు ఆటతీరు తీసికట్టుగా తయారైంది. ఎంతలా ఆంటే 2019లో ఇంగ్లండ్లో జరిగే వరల్డ్ కప్కి నేరుగా అర్హత సాధించలేకపోయింది. వన్డే క్రికెట్లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్, మరోసారి ఫైనలిస్ట్ అయిన జట్టు విండిస్కు ఇది ఊహించని ఎదరుదెబ్బే.
ఇంగ్లాండ్ వేదికగా 2019లో జరిగే వన్డే ప్రపంచ కప్నకు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని వెస్టిండిస్ కోల్పోయింది. మంగళవారం వెస్టిండిస్తో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఇంగ్లాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం విండిస్ వరల్డ్ కప్ ఆశలను గల్లంతు చేశాయి. దీంతో రెండు సార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్ క్వాలిఫై మ్యాచులు ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో 2019లో ఇంగ్లాండ్లో జరిగే వన్డే ప్రపంచకప్కు శ్రీలంక అర్హత సాధించింది.
ఐసీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబరు 30నాటికి టాప్-8 జట్లు 2019లో జరగబోయే వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఇటీవల శ్రీలంక.. భారత్ చేతిలో 5-0తో వన్డే సిరీస్లో ఓటమి పాలవ్వడంతో ఆ జట్టు ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో వెస్టిండీస్ నుంచి కొంత పోటీ ఏర్పడింది.
ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య ప్రస్తుతం ఐదు వన్డేల సిరీస్ కొనసాగుతోంది. ఈ సిరీస్ను వెస్టిండీస్ 5-0, 4-0 తేడాతో గెలిస్తే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించేది. కానీ, మంగళవారం ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలవడంతో వరల్డ్కప్కి నేరుగా ఆర్హతను సాధించలేకపోయింది.
ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించాయి. 2019లో వన్డే ప్రపంచకప్కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది.