ఆస్ట్రేలియాలో టీమిండియా బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాల పట్ల ప్రేక్షకుల తీరుపై భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జాత్యహంకార వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నాడు. గతంలోనూ కొంతమంది ఇలాంటి దిగజారుడు ప్రవర్తన కనబరిచారని, అయితే ఇప్పుడు జరిగిన ఘటన రౌడీయిజానికి పరాకాష్టలా మారిందని ఘాటుగా విమర్శించాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇలాంటి మాటలు వినాల్సి రావడం బాధాకరమని విచారం వ్యక్తం చేశాడు. ఇలాంటివి పునరావ్రుతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోహ్లి ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు.
కాగా సిడ్నీలో భారత్- ఆసీస్ మధ్య మూడో టెస్టు జరుగుతున్న సమయంలో ప్రేక్షకుల్లోంచి కొందరు జాసిరాజ్, బుమ్రాను ఉద్దేశించి వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీసీసీఐ తీవ్రంగా స్పందించి ఐసీసీ, ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ)కు ఫిర్యాదు చేసింది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా టీమిండియాకు క్షమాపణ చెబుతూ ప్రకటన విడుదల చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయితే నాలుగో రోజు ఆటలో అనగా.. ఈరోజు కూడా సిరాజ్ ను లక్ష్యంగా చేసుకుని కొందరు బిగ్ మంకీ, బ్రౌన్ డాగ్ వంటి పదాలు ఉపయోగించి దూషించినట్లు తెలుస్తోంది.
దీంతో కోహ్లి ఈ మేరకు స్పందించాడు. ఈ పరిణామాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడాసీరియస్గా తీసుకుంది. వర్ణ వివక్ష పూరిత వ్యాఖ్యలను ఖండించింది. ఆకతాయిలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు నివేదిక ఇవ్వాలని సీఏకు చెప్పింది. ఇక ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పిచ్చికూతలు కూసేవారిని మరోసారి స్టేడియంకు రానివ్వొద్దని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కోహ్లి ప్రస్తుతం పిత్రుత్వ సెలవుపై ఇండియాలో ఉన్న సంగతి తెలిసిందే.
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్కు చేదు అనుభవం
త్వరగా కూల్చకపోతే సిడ్నీలో గండమే!