సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టు అంటేనే స్లెడ్జింగ్కు పెట్టింది పేరు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల దృష్టి మరల్చేందుకు మాటల యుద్ధానికి దిగుతూ వారిని మానసికంగా దెబ్బకొట్టడం ఆసీస్ క్రికెటర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడే గతంలో వారు అనేక విజయాలు తమ ఖాతాలో వేసుకున్నారన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులోనూ ఆసీస్ మరోసారి తన బుద్ధిని బయటపెట్టుకుంది. ఆ జట్టు ఆటగాడు మార్నస్ లబుషేన్ భారత ఓపెనర్లు శుభ్మన్ గిల్, హిట్మ్యాన్ రోహిత్ శర్మపై స్లెడ్జింగ్కు దిగాడు.
వీరిద్దరు (రోహిత్(26;77 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) , శుబ్మన్ గిల్(50;101 బంతుల్లో 8 ఫోర్లు)) నిలకడగా ఆడుతున్న సమయంలో అసందర్భ ప్రశ్నలు సంధిస్తూ ఏకాగ్రత చెడగొట్టే ప్రయత్నం చేశాడు. ఫీల్డింగ్ చేస్తున్న మయంలో లబూషేన్.. గిల్ను ‘నీ అభిమాన క్రికెటర్ ఎవరు’ అని అడిగాడు. అయితే గిల్ కూడా ఏమాత్రం తగ్గకుండా… మ్యాచ్ ముగిసిన తర్వాత చెబుతాలే అంటూకౌంటర్ వేశాడు. స్టార్క్ వేసిన రెండో ఓవర్లో ఈ ఘటన జరిగింది.
ఇక ఆ తర్వాత బంతికి సచిన్ ఇష్టమా లేదా విరాట్ ఫేవరెటా అంటూ మళ్లీ ప్రశ్నలు వేశాడు లబూషేన్. అంతేగాక రోహిత్ స్ట్రైకింగ్ వచ్చిన తర్వాత కూడా.. క్వారంటైన్లో ఏం చేశావ్ అని రోహిత్పై స్లెడ్జింగ్కు దిగాడు. కాగా సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 333 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. పుజారా, కెప్టెన్ రహానే క్రీజులో ఉన్నాడు.
నోరు పారేసుకున్న వార్న్.. మరీ ఇంత నీచమా!
సిడ్నీ టెస్టు: అతని చేతుల మీదుగా సైనీకి క్యాప్