టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతికి టెస్ట్ హోదా గద రానుంది. ఏటా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానం నిలిచిన జట్టుకి ఐసీసీ నజరానాతో పాటు టెస్టు గద ఇవ్వనున్న విషయం తెలిసిందే. తాజాగా ర్యాంకింగ్స్లో భారత్ జట్టు 121 పాయింట్లతో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. తర్వాత దక్షిణాఫ్రికా (115), ఆస్ట్రేలియా (104), న్యూజిలాండ్ (100), ఇంగ్లాండ్ (99) జట్లు టాప్-5లో ఉన్నాయి.
దక్షిణాఫ్రికాతో టీ 20 మ్యాచ్ ముగియగానే టెస్ట్హోదా గద కోహ్లీ చేతికి రానుంది. ఏప్రిల్ 3న కటాఫ్ డేట్ ఉండగా.. అప్పటిలోపు ఏ జట్టూ కూడా భారత్ని అధిగమించే అవకాశం లేకపోవడంతో టీమిండియాకే నజరానాతో పాటు గదని శనివారమే ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. గత ఏడాది కూడా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ గదని అందుకున్న విషయం తెలిసిందే.
భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ పొలాక్ చేతుల మీదుగా విరాట్ కోహ్లి ఆ గదని అందుకోనున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ గదతో పాటు భారత్ జట్టుకి నజరానా రూపంలో సుమారు రూ. 6.5 కోట్లని ఐసీసీ ఇవ్వనుంది. 124 పాయింట్లతో దక్షిణాఫ్రికా పర్యటనని ఆరంభించిన భారత్.. మూడు టెస్టుల సిరీస్ని 1-2తో చేజార్చుకుని 121 పాయింట్లకి చేరుకుంది. దక్షిణాఫ్రికా రెండు టెస్టుల్లో విజయం సాధించడం ద్వారా 111 పాయింట్ల నుంచి 115కి చేరుకుంది.