ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఇటీ వలి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి చెందడంతో పార్టీ పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. పార్టీకి భవిష్యత్తులేదని కొందరు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు భాజాపా తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా బాబుకు మరో డబుల్ షాక్ తగిలింది.
టీడీపీలో మరో భారీ రెండు వికెట్లు పడనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన సీనియర్ నేత… అంబికా కృష్ణ ఇవాళ టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఢిల్లీలో బీజేపీ నేత రామ్ మాధవ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరబోతున్నారు. అంబికా కృష్ణతోపాటూ… ఆయన సోదరుడు అంబికా రాజా కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు.ఇప్పుడు ఆయనే సైకిల్ వదిలేస్తుండటంతో… మరో భారీ పంక్చర్ పడినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక రెండో వికెట్ వంగవీటి రాధా. టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. వంగవీటి పవన్ను కలవడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలయ్యింది. రాధా త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈరోజు సాయంత్రం లేదా రేపు వంగవీటి రాధ జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు వైసీపీ నుంచి బయటకొచ్చిన రాధా టీడీపీలో చేరారు.సీటు రాకపోయినా దక్కకపోయినప్పటికీ పార్టీ అధికారంలోకి వస్తే కీలక పదవి వస్తుందని భావించారు. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా మారి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ తరపున ప్రచారం నిర్వహించారు. కాని సీన్ రివర్స్ అవడంతో ఇప్పుడు భవిష్యత్కోసం జనసేన వైపు చూస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి రావడంతో వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్ సందిగ్థంలో పడింది. ఈలోపే టీడీపీ నుంచి బీజేపీలోకి చేరికలు మొదలయ్యాయి. దీంతో వంగవీటి కూడా రాజకీయ భవిష్యత్పై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అందుకే జనసేనలోకి వెళ్లాలని భావిస్తున్నారనే ప్రచారం మొదలయ్యింది.