సీఎం వైఎస్ జగన్పై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత మిత్రులను కలుసుకొనేందుకు అసెంబ్లీకి వచ్చి జేసీ మీడియాతో ముచ్చటించారు. తాను రాజకీయాలనుంచి రిటైర్ మెంట్ తీసుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ను ప్రశంసలతో ముంచెత్తారు.
బీజేపీలో చేరాలంటూ తనకు ఆఫర్ వచ్చిందంటున్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. కొందరు కాషాయ పార్టీ నేతలు తనతో టచ్లో ఉన్నారని.. కానీ తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పానని.. అలాంటప్పుడు పార్టీ ఎలా మారతానని ప్రశ్నించారు. వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలో తనకు ఆప్త మిత్రులు ఉన్నారని, వాళ్లను కలుసుకునేందుకే వచ్చానని అన్నారు. సీఎం జగన్ పాలన, పనితీరు ఎలా ఉందో తనకు తెలియదని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ పర్యటనలో జగన్ చాలా హుందాగా వ్యవహరించాడని జేసీ కితాబిచ్చారు. ‘500 మంది ఉన్న మోదీ సైన్యంతో నేను తలపడలేను అని వాస్తవాన్ని గ్రహించి మాట్లాడాడు. ఢిల్లీ వెల్లిన ప్రతీసారి ప్రత్యేక హోదా గురించి అడుగుతూనె ఉంటానని చెప్పిన నర్ణయం ఆయన కమిట్ మెంట్కు నిదర్శనమన్నారు.
తాను భయపడి జగన్పై పొగడ్తలు కురిపించడం లేదని.. సీఎం తీరు నచ్చి ప్రశంసిస్తున్నానని చెప్పుకొచ్చారు. తాను భయపడుతున్నానో లేదో ఆరు నెలల తర్వాత చూస్తారని మరో బాంబ్ పేల్చారు. చంద్రబాబు కూడా ఇదే మాట చెప్పారన్నారు.
జగన్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసనీ, అతనిది ఉద్రేకంతో కూడిన స్వభావమని వ్యాఖ్యానించారు. ఒకడు చెబితే ఆయన వినిపించుకోరని తాను భావించానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అభిప్రాయాలు అన్నాక మారుతాయనీ, బతికినంతకాలం ఒకే అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.