కరోనా వైరస్ అమెరికాలో భయంకర పరిస్థితిని సృష్టిస్తోంది. వైరస్ వ్యాప్తి గడిచిన 24 గంటల వ్యవధిలో తీవ్రంగా పెరిగింది. దాంతో పది వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో యూఎస్ లో వైరస్ బారినపడిన వారి సంఖ్య 49,594కు చేరింది. మంగళవారం ఒక్క రోజే 130 మంది మృతి చెందడంతో, మొత్తం మృతుల సంఖ్య 622కి చేరుకుంది.
ఇక వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 16,961 మంది మరణించగా, వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 4 లక్షలను దాటింది. మాస్కులను, శానిటైజర్లు ఇతర మందులను అక్రమంగా నిల్వచేస్తే కఠిన చర్యలు తీసింటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఔషధాలు, మాస్క్ లను అధిక ధరలకు విక్రయిస్తే, శిక్ష తప్పదన్నారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ట్రంప్ అన్నారు.
అమెరికాలో వైరస్ బారినపడిన ప్రతి ఇద్దరిలో ఒకరు న్యూయార్క్ వారే కావడం గమనార్హం. ఇక ఈ నగరంలో 24 గంటల వ్యవధిలో 5,085 కొత్త కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్ సిటీ, మెట్రో ఏరియా, న్యూజెర్సీ, లాండ్ ఐలాండ్ తదితర ప్రాంతాల్లో ప్రతి వెయ్యిమంది జనాభాలో ఒకరికి కరోనా సోకినట్లు వైట్ హౌస్ కరోనా టాస్క్ఫోర్స్ ఆఫీసర్ డెబ్రా ఎల్ బ్రిక్స్ తెలిపారు. కరోనా సోకిన ప్రాంతాలకు తగినన్ని మందులు, ఇతర పరికరాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు.