భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. అవును మీరు విన్నది నిజమే. దాయాది దేశాల మధ్య పోరు మొదలైంది. కానీ సరిహద్దుల్లో కాదు. సరిహద్దులో తుపాకుల మోత లేకుండా.. ఒక్కరి ప్రాణం పోకుండా పాక్ను ముప్పుతిప్పలు పెడుతోంది. 21వ శతాబ్ధంలో యుద్ధాలు ఎలా చేస్తారో అదే పంథాను అనుసరిస్తోంది భారత్. పాక్పై దౌత్యపరంగా, వాణిజ్యపరంగా, ప్రకృతి వనరులు అందకుండా చేయడం.. ఇలా అన్ని వైపులా నుంచి నర్కుక్కుంటు వస్తుంది భారత్. కేవలం ప్రత్యక్ష దాడులు తప్ప అన్ని చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.
పుల్వామా ఉగ్ర ఘటనలో 44 మంది సైనిక వీరులను పొట్టనుపెట్టుకున్నారు పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు. ప్రత్యక్షంగా భారత్ పైకి యుద్ధానికి దిగే సత్తా లేక సైనికులు వారి స్థావరాలపై దాడులు చేస్తూ వారి స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చూస్తూనే ఉన్నారు. కానీ వారు ఎప్పుడూ విజయం సాధించలేకపోయారు. ఇప్పటి వరకు కేవలం ఉగ్రవాద నిరోధనపై దృష్టి సారించిన కేంద్రం.. అసలు ఈ దమనకాండకు కారకులపైన చర్యలు తీసుకోవడానికి నడుం బిగించింది.
పుల్వామా ఉగ్రదాడి జరిగిన వెంటనే అన్ని దేశాల దౌత్యాధికారులతో చర్చించింది. తాము చేయబోయేది ఏంటో? ఈ ఉగ్రదాడి వెనుక ఎవరున్నారో వారికి వివరించింది. ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ ప్రకటించుకున్న విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది భారత్. ఆ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ పాకిస్థాన్ ప్రభుత్వానికి కావాల్సినవాడని.. అజర్, పాకిస్తాన్ నిఘా సంస్థ డైరెక్షన్లోనే ఈ దారుణం జరిగిందని ప్రపంచానికి చెప్పింది. దీంతో పాకిస్తాన్ అసలు స్వరూపాన్ని ప్రపంచ దేశాలకు వివరించింది భారత్.
అంతేకాదు ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య హోదాను భారత్ రద్దు చేసుకుంది. పాకిస్తాన్ నుంచి భారత్కు దిగుమతయ్యే వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 200 శాతం పెంచింది. అట్టారి గుండా సరుకుల రవాణాను నిలిపివేసింది. దీంతో ఇరుదేశాల మధ్య సరుకుల రవాణా ఆగిపోయింది. ఇక ప్రజలు కూడా స్వచ్ఛంధంగా పాకిస్తాక్కు ఎగుమతులు ఆపేశారు. ఇక పాక్కు వెళ్లే నీటిని కూడా ఆపేసింది కేంద్రం.
మరోవైపు అంతర్జాతీయంగా కూడా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నుంచి పాకిస్తాన్ ను బ్లాక్ చేయించేందుకు భారత్ పావులు కదుపుతుంది. ఈ మేరకు ప్రపంచదేశాలతో భారత్ చర్చలు జరుపుతుంది. దీనికి అనుగుణంగానే తాజాగా ప్యారిస్ లో జరిగిన ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో పాకిస్తాన్ ని ప్రస్తుతం ఉన్న గ్రే లిస్ట్ లోనే కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. దీంతో అంతర్జాతీయంగా పాక్కు రుణాలు దక్కే పరిస్థితి లేదు.
ఇక కశ్మీర్ వేర్పాటువాదులకు భద్రతను ఉపసంహరిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది కేంద్రం. ఇది రాజకీయంగా ఓ సాహసమే అని చెప్పాలి. మరోవైపు జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు ఇంటింటిని జల్లెడ పడుతూ ఉగ్రవాదులను ఏరివేస్తున్నారు. ఇలా పాక్ను అష్టదిగ్బంధనం చేస్తూ పాక్కు ఊపిరాడకుండా చేస్తోంది భారత్. పరోక్షంగా దాయాదిపై యుద్ధం ఎప్పుడో ప్రారంభించింది.
ఇక ప్రత్యక్ష పోరుకు కూడా సర్వం సిద్ధం చేస్తోంది కేంద్రం. ఇప్పటికే వంద కంపెనీల బలగాలు వాయు మార్గం గుండా కశ్మీర్కు చేరుకున్నాయి. ఏమవుతుందో వేచి చూడాలి మరి.