ఏపీలోని టీడీపీ అధినేత నివాసమైన ఉండవల్లిలోని లింగమనేని గెస్ట్ హౌస్ కు వరద ముప్పు ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరద నీరు బాబు ఇంటి వరకు చేరింది. మరో వైపు రవద మరింత పెరుగుతుందనే సంకేతాలు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
ఈ నేపథ్యంలో కృష్ణా నదికి వరద ఉద్ధృతి నేపథ్యంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చంద్రబాబు నివాసంపైకి డ్రోన్ న్ల ద్వారా ఫోటోలను తీశారు. అయితే ఈ వ్యవహారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ కార్యకర్తలు వారిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని తాము అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈ విషయం తెలుసుకున్న బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పాటు గుంటూరు జిల్లా సూపరింటెండెంట్(ఎస్పీ)తో ఫోన్ లో మాట్లాడారు. హైసెక్యూరిటీ జోన్ లో డ్రోన్లు ఎలా ఎగరవేస్తున్నారని ప్రశ్నించారు. డ్రోన్లు ప్రయోగించింది ఎవరు? అందుకు అనుమతులు ఎవరు ఇచ్చారు? అని నిలదీశారు.ఈ ఘటన వెనుకఉన్న వ్యక్తుల పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు
అయితే బాబు చేసిన వ్యాఖ్యలకు ఇరిగేషన్ అధికారులు కౌంటర్ ఇచ్చారు. డ్రోన్ ద్వారా విజువల్స్ తీయాల్సిందిగా తామే ఆదేశించామని ఏపీ జలవనరుల శాఖ తెలిపింది.వరద పరిస్థితిపై అంచనాకు వచ్చేందుకు విజువల్స్ తీయాల్సిందిగా కోరామని వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఎగువ ప్రాంతం నుంచి మరింత వరద వచ్చే అవకాశముందని చెప్పింది. ఈ నేపథ్యంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై ఓ అవగాహనకు వచ్చేందుకే విజువల్స్ తీయాలని నిర్ణయించామని పేర్కొంది.