సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరించాల్సిందేనని సుప్రీంకోర్టు మరో సారి తేల్చి చెప్పింది. ఆర్బీఐ ఖాతాలను, తనిఖీ నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచాలంటూ గతంలో తాను ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆర్బీఐ జరిపే వార్షిక తనిఖీల నివేదికను, బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను ఎగ్గొట్టిన వారి పేర్లను ఆర్టీఐ కింద బహిర్గతం చేయాల్సిందేనని శుక్రవారం ఆదేశించింది. ఆర్టీఐ కార్యకర్త అగర్వాల్ వేసిన పిటిషన్ను స్వీకరించిన సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.
వార్షిక తనిఖీ నివేదికను బ్యాంకులు విడుదల చేయాలని జనవరి నెలలో నోటీసులు కూడా సుప్రీంకోర్టు జారీ చేసింది. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆర్టీఐ చట్టం ప్రకారం వివరాలను తెలుపాలని కోర్టు కోరింది. ఆర్బీఐకి ఇదే చివరి అవకాశమని వెంటనే తన ఖాతాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది.