ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తీవ్ర ప్రజల వ్యక్తిగత డేటా, ఆధార్ వివరాల చౌర్యం కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్ పోలీసులకు లొంగిపోకుండా పరారాలో ఉన్నారు. ఎన్నికలు ముగియడంతో కేసులో కదలికి వచ్చింది.
అశోక్ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రణాళిక కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పలు రకాల వ్యూహాలను సిద్ధం చేసుకున్న సిట్… న్యాయస్థానం ఆదేశాలతోనే ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిలో భాగంగానె అశోక్ ను అరెస్ట్ చేసేందుకు సిట్ బృందం ఏపీలో వేట ప్రారంభించింది. అశోక్ ఏపీలోనే ఆశ్రయం పొందాడన్న సమాచారాన్ని గుర్తించిన సిట్ టీమ్, త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది.
గతంలో విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా హాజరు కాకపోవడంతోనే అరెస్ట్ చేయాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.ఈ కేసులో అశోక్ ను అరెస్ట్ చేస్తేనే కీలక ఆధారాలు లభ్యమవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక ఐటీ గ్రిడ్స్ లో జరిపిన తనిఖీల్లో హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకని, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపగా, మొత్తం 7.82 కోట్ల మంది రికార్డులు ఉన్నాయని వెల్లడైన సంగతి తెలిసిందే.