తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల ఎంపికలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. ప్రతీ వ్యవస్థలో పారదర్శకత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్… టీటీడీ పాలకమండలి విషయంలో కూడా ఆ విధంగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. కొంత కాలంగా దేవస్థానం బోర్డ్ విషయంలో అవినీతి ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం సర్కార్ బోర్డ్ ని మరింత భ్రష్టు పట్టించిందనే ఆరోపణలు ఉన్నాయి.
దీనితో బోర్డ్ ని ప్రక్షాళన చేసే విధంగా ముఖ్యమంత్రి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తొలిసారి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ మెంబర్ గా జర్నలిస్ట్ కి అవకాశం ఇచ్చే విధంగా జగన్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా “దరువు” మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కరణ్ రెడ్డికి బోర్డ్ మెంబర్ గా అవకాశం ఇవ్వాలని జగన్ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. 2014 లో తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దరువు ద్వారా ఆయన అనేక ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకువెళ్ళడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం వంటివి చేసారు. దీనితో ముఖ్యమంత్రి కెసిఆర్ కి అప్పుడు మంత్రిగా ఉన్న కేటిఆర్ కి కరణ్ రెడ్డి ఎంతో సహకరించారు.
ఆయన పని తీరుని మెచ్చుకున్న కేటిఆర్ తన టీంలో కరణ్ కి అవకాశం ఇచ్చారు. పొగడ్తలకు మురిసిపోని ఆయన ఇటు ఆంధ్రప్రదేశ్ మీద కూడా దృష్టి సారిస్తూ వచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం సర్కార్ చేస్తున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలను తన కథనాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కరణ్ దాదాపుగా సఫలం అయ్యారు. విపక్షం గొంతు నొక్కుతున్నారని భావించిన ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. 2019 ఎన్నికల్లో వైకాపాకు ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి జగన్ ముఖ్యమంత్రి కావడంలో తన వంతు పాత్ర పోషించారు.
ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల ద్వారా ప్రజలకు జరిగే నష్టాలను విపులంగా వివరించడంలో ఆయన విజయవంతం అయ్యారనే చెప్పాలి. దీనితో కేటిఆర్ ఆయన చేసిన కృషిని జగన్ కి వివరించినట్టు తెలుస్తుంది. తెలంగాణా నుంచి కూడా తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి ప్రజలు రావాలి అంటే రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కనీసం బోర్డ్ లో సభ్యులుగా ఉండాలని అప్పుడే ఆదరణ వస్తుందని, అలాగే జర్నలిస్టుని నియమించడం ద్వారా అవినీతికి తావు లేకుండా చేయవచ్చని కేటిఆర్ సూచించారట. అలాగే తెలుగుదేశం ప్రభుత్వ తప్పులను కరణ్ ఏ విధంగా వివరించారు అనేది కూడా సాక్ష్యాలతో సహా చూపించడంతో బోర్డ్ లో సమర్ధుడిగా కరణ్ ఉంటె బాగుంటుందని జగన్ భావించినట్టు తెలుస్తుంది.
కరణ్ రెడ్డిది ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం. ఆ నియోజకవర్గం నుంచి ప్రతీసారి బోర్డ్ మెంబర్ గా ఒకరికి ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తున్నాయి. గతంలో ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్యకు తెలుగుదేశం ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఆయన రెండు సార్లు ఆ పదవిని సమర్ధవంతంగా నిర్వహించారు. ఇక ఈసారి నియోజకవర్గం నుంచి యువకుడైన కరణ్ రెడ్డికి అవకాశం ఇస్తే బాగుంటుందని కేటిఆర్ సూచించడంతో జగన్ మరో ఆలోచన లేకుండా అంగీకరించారట. ఇటీవల జరిగిన తొలి కేబినేట్ భేటీలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని భావించినా అప్పుడు కొన్ని కారణాలన వలన అది వాయిదా పడింది. ఇక తెలంగాణా నుంచి మరో వ్యక్తిగా మైహోం రామేశ్వరరావు కి అవకాశం ఇవ్వాలని కూడా భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఏది ఎలా ఉన్నా తొలిసారి బోర్డ్ లో జర్నలిస్ట్ కి అవకాశం దక్కే సూచనలు కనపడటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.