ఉత్తర ప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాయ్బరేలి జిల్లా హర్చంద్పూర్ సమీపంలో న్యూఫరక్కా ఎక్స్ప్రెస్ రైలులో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ గటనలో ఏడుగురు ప్రయాణీకులు మృతి చెందగా 35 మందికిపైగా గాయాలపాలయ్యారు. ప్రమాద సమాచారం తెలియగానే లఖ్నవూ, వారణాసి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి బయల్దేరాయి.
పశ్చిమ బెంగాల్లోని మాల్దా పట్టణం నుంచి న్యూఢిల్లీకి వెళ్లే న్యూ ఫరక్కా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్లోని హర్చందాపూర్ వద్ద బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో రైలు పట్టాలు తప్పినట్టు ఉత్తర రైల్వే డివిజనల్ మేనేజర్ సతీష్ కుమార్ వెల్లడించారు. ఇంజిన్ సహా ఐదు బోగీలు పట్టాలు తప్పాయని చెప్పారు.
ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు డాక్లర్ల బృందంతో కూడిన వ్యాన్ లక్నో నుంచి ఘటనా స్థలానికి వెళ్లింది. అలాగే మొఘల్సరాయిలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్లో హెల్ప్లైన్ నంబర్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన మార్గంలో వెళ్లాల్సిన రైళ్లను దారి మళ్లించారు.
ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలను రైల్వే మంత్రి పియూష్ గోయల్ పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు ఫోన్లు చేసి సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. మరో వైపు రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లొహాని ఘటనా స్థలానికి చేరుకుంటున్నారని సంబంధిత అధికారులు వెల్లడించారు.
విషయం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి, పరిస్థితిపై చర్చించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రగాయాలైన వారికి 50వేల రూపాయల్ని మంజూరు చేశారు.