వైసీపీ అధినేత జగన్ ఈనెల 24న రాష్ట్రబంద్కు పిలుపు నిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ప్రజలను బాబు సర్కార్ మోసం చేస్తున్న కారనంగానే బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. తెదేపా ఎంపీలంతా రాజీనామాలు చేసి నిరాహార దీక్షలకు కూర్చోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అందరు ఎంపీలు రాజీనామాలు చేసి పోరాటం చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదని ప్రశ్నించారు.హోదా రావాలంటే, అంతకుమించిన మార్గం లేదని అన్నారు.
నిన్న లోక్సభలో అవిశ్వాసంపై జరిగిన చర్చలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్, భాజపాలు ఏమాత్రం మాట్లాడలేదని జగన్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఏపీకి సంబంధించిన అంశాలపై అర నిమిషం కూడా మాట్లాడలేదని విమర్శించారు. హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు అన్నవారికి నిన్న పార్లమెంట్లో ఆ విషయం గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు.
బంద్ ను విజయవంతం చేస్తే, ఏపీ ప్రజలు కేంద్రంపై ఆగ్రహంతో ఉన్నారన్న సంకేతాలు వెళతాయని జగన్ చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ఉన్న సెంటిమెంట్ ను మిగిలిన పార్టీలకు కూడా తెలియజెపుదామని, ఆ స్థాయిలో బంద్ ను జరుపుదామని అన్నారు.
ప్రజలంతా స్వచ్ఛందంగా ఈ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఎక్కడికక్కడ బస్సులను, రహదారులను దిగ్బంధించాలని, చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి, తన ఎంపీలతో రాజీనామా చేయించేంత వరకూ తమ పార్టీ నిరసన కార్యక్రమాలు జరుపుతూనే ఉంటుందని అన్నారు.