మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనగా సూపర్స్టార్ రజనీకాంత్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని తెల్చి చెప్పేశారు. చెన్నైలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో రజనీ తన నిర్ణయాన్నిప్రకటించారు.
2021లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే తన టార్గెట్ అని, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, మరే ఇతర పార్టీకి కూడా మద్దతు ఇచ్చేది లేదన్నారు. ఏ పార్టీ వారైనా కనీసం తన ఫోటోను వాడుకున్న చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో నీటి సమస్యను పరిష్కరిస్తారని భావించిన వారికే ప్రజలు ఓటు వేయాలని సూచించారు.
రజనీ నిర్ణయాన్ని బట్టి తమ పార్టీకి పోటీ చేసే సత్తా లేదని అర్థమయ్యింది. రాష్ట్రంలో సత్తా చాటిన తరువాతే జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని రజనీకాంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్ తన పార్టీకి రజనీకాంత్ మక్కల్ మంద్రం అనే పేరు పెడతారని సమాచారం.
రజనీ నిర్ణయం వెనుక ఆప్ పార్టీని ఇన్స్పరేషన్గా తీసుకున్నట్టు ఉన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ పార్టీని స్థాపించాక, ముందుగా ఢిల్లీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టి విజయం సాధించారు. రజనీకాంత్ కూడా ఇదే ఫార్ములాతో వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని సంస్థాగతంగా ఏర్పాటు చేసుకోకుండా హడావుడిగా ఎన్నికల బరిలో దిగితే… ఇదివరకు చిరంజీవి పార్టీ ప్రజారాజ్యానికి పట్టిన గతే తమకూ పట్టే ప్రమాదం ఉందని తలైవా భావించినట్లు తెలుస్తోంది. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ఏ మాత్రం రెడీగా ఉన్నాననుకుంటున్నారో చూడాలి మరి.