చేతిలో అధికారం ఉన్నా లేకపోయినా.. తన వెంట నేతలున్నా లేకపోయినా.. నేను నిరంతరం పోరాడుతూనే ఉంటా.. ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటా.. ఇవేవో సినిమా డైలాగులు కాదు.. హిరో నుంచి రాజకీయ నేతగా మారిన జనసేన అధినేత నోటి నుంచి వెలువడిన మాటలు. కానీ ఇవి పవన్ మనసులోంచి వచ్చాయనుకున్నారు అందరూ. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇవి కేవలం తాత్కాలికంగా తన ముందు ఉన్న కార్యకర్తలనో.. లేక తనను ఫాలో అవుతున్న ఫ్యాన్స్నో ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే చేసిన వ్యాఖ్యల్లాగానే కనిపిస్తున్నాయి. కారణం ప్రశ్నించాల్సిన సమయంలో ఆయన మౌన ముని అవతారం ఎత్తడం.
కొంతకాలంగా బాబుపై ఘాటు విమర్శలు చేసిన పవన్.. గడిచిన రెండు.. మూడు నెలలుగా కామ్ గా ఉండటం ఆసక్తికరంగా మారింది. గుంటూరు జిల్లా కొండవీడు గ్రామానికి చెందిన అన్నదాత ఒకరు పొలంలోనే పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం.. అధికారుల తీరును తప్పు పడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతు మృతిపై పవన్ స్పందించిన తీరు ఇప్పుడు కొత్త ప్రశ్నల్ని తెర మీదకు తెస్తోంది.
పవన్ రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వ తీరును ఎండగడతారనుకుంటే ఓ ట్వీట్ చేసి వదిలేశారు. తన పార్టీ నేతలను పరామర్శకు పంపారు. ఆ తరువాత ఆ ఊసు ఎత్తితే ఒట్టు. రైతుమృతిపై పవన్ పోరాడుతారనుకుంటే సూటిగా కాకుండా చాలా స్మూత్ గా చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోంది.
రాజకీయ ప్రత్యర్థిని విమర్శించే విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయటం వెనుక అసలు కారణం ఏమిటి? అప్పుడెప్పుడో మార్చిలో పొత్తుపై చర్చలు జరుగుతాయని ఓ టీడీపీ నేత సెలవిచ్చారు. ఆ వ్యాఖ్యలను ఈ మౌనానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమో చూడాలి మరి.