కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనియా గాంధీ కేడ్చల్ బహిరంగ సభలో పాల్గొన్నారు. మరో సారి తెలంగాణా సెంటీ మెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. తన బిడ్డల వద్దకు ఒక తల్లి వచ్చినప్పుడు ఎంత సంతోషపడుతుందో… ఇప్పుడు తెలంగాణకు వచ్చిన తాను కూడా అంతే సంతోషపడుతున్నానని సెంటీమెంట్ అస్త్రాన్ని సోనియాగాంధీ ప్రయోగించారు. ఆరు దశాబ్దాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ సర్కార్ సర్వనాశనం చేసిందని విమర్శలు చేశారు.
తెలంగాణ గడ్డమీద అడుగుపెడితే తన సొంత తల్లికి వెళ్లినట్లు ఉందని, ప్రజల కోరిక మేరకు ఎంతో కష్టమైన తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ నిరవేర్చిందని ఆమె వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతుందని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ప్రజల పోరాటాన్ని గుర్తించి రాష్ట్రాన్ని ఏర్పాటుచేశామని వెల్లడించారు.
నీళ్ళు,నిధులు,నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ విషయాల్లో ఒక్కటైనా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ యువత ఉద్యోగాల కోసం అల్లాడుతున్నారని సోనియా చెప్పారు.
కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, బంధు మిత్రులు మాత్రమే బాగుపడ్డారని సోనియా విమర్శించారు. పేదల కోసం ప్రారంభించిన సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదన్నారు. ఎంతో ప్రతీష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించామని దాన్ని సరిగా అమలు చేయడంలేదని ఆరోపించారు.
తెలంగాణ ఏర్పాటు చాలా కష్టసాధ్యమైందని తమకు తెలుసని..మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ లాంటి వారి వల్ల రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు సోనియా. రాజకీయంగా నష్టపోయిన తెలంగాణ ఏర్పాటు చేశామని చెప్పారు. అదే సమయంలో ఏపీ నష్టపోకూడదనే ఉద్దేశంతో విభజన చట్టంలో ఎన్నో ప్రయోజనాలను చేకూర్చామని సోనియా తెలిపారు. ప్రత్యేక హోదా సహా ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని సోనియా హామీ ఇచ్చారు.