ఎన్నికల సమయంలో వైసీపీ మరో మందడుగు వేసింది. బీసీ గర్జన సభను కాసేపట్లో నిర్వహించబోతోంది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ సభలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించనున్నారు. సభ నిర్వహన ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీడీపీ రాజమండ్రిలో బీసీలకు చాలా వరాలు ప్రకటించింది. దాన్ని తలదన్నేలా జగన్ ప్రకటించే బీసీ డిక్లరేషన్ ఉండబోతోందని సమాచారం. బీసీల్లో వివిధ కులాల స్థితిగతులు, వెలుగులోకి రాని కొన్ని కులాల ఈతి బాధలపై క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు వైఎస్ జగన్ సుమారు ఏడాదిన్నర క్రితమే బీసీ అధ్యయన కమిటీని నియమించారు. ఈకమిటీ రాష్ట్రం అంతటా పర్యటించి వారి జీవన స్థితిగతులపై అధ్యయనం చేసింది. బీసీ వర్గాల్లో విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలతో విపులంగా చర్చలు జరిపింది. జిల్లాలవారీగా వెలుగులోకి వచ్చిన కొత్త సమస్యలను క్రోడీకరించింది.
2014 ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలిచ్చి మోసగించడంతో బీసీల పరిస్థితి ఎలా దిగజారిందో వివరిస్తూ కమిటీ ఈ ఏడాది జనవరి 28వ తేదీన జగన్కు సమగ్ర నివేదిక సమర్పించింది. మరోవైపు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా వివిధ కుల సంఘాల ప్రతినిధులు, చేతి వృత్తుల ప్రతినిధులు జగన్ను నేరుగా కలుసుకుని తమ కష్టాలను విన్నవించుకున్నారు.
బీసీల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదంటున్న వైసీపీ అధినేత జగన్… కంటితుడుపు చర్యలా కత్తెరలు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చే పథకాలు కాకుండా తాము నిజమైన అభివృద్ధి, అన్ని రంగాల్లో దూసుకెళ్లేలా డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. ఎన్నికల ముందు జగన్ ప్రకటించే బీసీ డిక్లరేషన్ ఎలా ఉండబోతోందో కాసేపట్లో తేలిపోనుంది.