ఆంధ్రప్రదేవ్ లో వైఎస్ జగన్ గెలవడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఏపీలో పనిచేయడానికి సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆసక్తి చూపుతున్నారు. ఏపీకి వెళ్లడానికి కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి తాజాగా తెలంగాణలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ దరఖాస్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈమెను పంపడానికి సానుకూలంగా స్పందించారు.ఇక జగన్ కోసం మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా డిప్యూటేషన్ పై ఏపీకి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా వైఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్ లు జగన్ వద్ద పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనింగ్ శాఖను సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి చూశారు. శ్రీలక్ష్మీ ఇప్పటికే జగన్ తో మాట్లాడారని.. ఏపీలో సేవలు అందించేందుకు అవకాశం కల్పించాలని కోరారని సమాచారం. జగన్ కూడా ఇందుకు అంగీకరించారని తెలుస్తోంది. శ్రీలక్ష్మీ ఓబుళాపురం గనుల కుంభకోణం కేసులో జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత నిర్ధోషిగా బయటకు వచ్చిన ఆమె తెలంగాణలో ఐఏఎస్ గా కొనసాగుతున్నారు. 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఈమె అతిచిన్న వయస్సులో ఐఏఎస్ గా ఎంపికయ్యారు. తెలంగాణ, ఆంధ్రా విభజన సమయంలో తెలంగాణకు కేటాయించబడ్డారు.
వైసీపీ అధినేత జగన్ కోసం తెలంగాణలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు ఇలా వరుసగా క్యూ కట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.. నిన్న సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర.. తెలంగాణ ఐజీ పోస్టు నుంచి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా వెళ్లడానిరి రెడీ అయ్యారు. ఇందుకు వైఎస్ జగన్ చొరవ చూపడం.. కేసీఆర్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో ఆయన ఏపీకి వెళ్లడం త్వరలోనే జరగనుంది. ఇక ఇప్పుడు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా జగన్ పాలనలో పనిచేయాలని దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే జగన్ సైతం ఏపీ పోలీస్ ఉన్నతాధికారుల కంటే తెలంగాణలో వైఎస్ హయాంలో పనిచేసిన వారివైపే మొగ్గు చూపుతున్నారు. బాబు పాలనలో ఏపీ పోలీసులు జగన్ ను, వైసీపీ నాయకులను ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని స్వయంగా జగనే చెప్పుకొచ్చారు. అందుకే తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ లు ఏపీకి మొగ్గుచూపడం.. జగన్ కూడా ఆసక్తి చూపడం విశేషం.