సిడ్నీలో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఓటమి పాలయ్యింది. ఆసిస్ 34 పరుగుల తేడాతో గెలిచింది. హిట్మ్యాన్ రోహిత్ శర్మ(133: 129 బంతుల్లో 10ఫోర్లు, 6సిక్సర్లు) సెంచరీ చేసినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ లక్ష్య ఛేదనలో 50 ఓవర్లలో 9 వికెట్లకు 254 పరుగులే చేసింది. 34 పరుగుల తేడాతో నెగ్గిన ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్సన్(4/26) సంచలన ప్రదర్శన చేశాడు. ఒకే ఓవర్లో విరాట్ కోహ్లీ(3), అంబటి రాయుడుల(0)ను పెవిలియన్ పంపి సత్తాచాటాడు.
289 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఛేదనను చెత్తగా ఆరంభించిన భారత్ను లక్ష్యానికి చేరువగా తీసుకొచ్చింది రోహితే. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జట్టును రోహిత్తో పాటు ధోనీ మాత్రమే ఆదుకున్నారు. శిఖర్ ధావన్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు చేజార్చుకొని ఒత్తిడిలో పడింది. అంబటి రాయుడు (0)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ (3) నిరాశపరిచారు.
కష్టాల్లో ఉన్న టీమిండియాను రోహిత్, ధోనీ ఆదుకున్నారు. సెంచరీ భాగస్వామ్యంతో భారత ఇన్నింగ్స్ చక్కదిద్దారు. రోహిత్ తనదైన శైలిలోనే దూకుడుగా ఆడగా…ధోనీ డిఫెన్స్కే పరిమితమయ్యాడు. ధోనీతో కలిసి 136 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం జోడించి భారత్ను పోటీలో నిలిపాడు రోహిత్. 93 బంతుల్లో 68వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ధోనీ ఔటయ్యాడు. ధోనీ-రోహిత్ నాలుగో వికెట్కు 171 బంతుల్లో 137 పరుగులు జోడించారు.
ధోనీ అవుట్ అయిన తర్వాత రోహిత్కు ఏ ఒక్క ఆటగాడి దగ్గర్నుంచీ సహకారం లభించలేదు. దినేశ్ కార్తీక్(12), రవీంద్ర జడేజా(8)లు నిరాశపరచడంతో భారత్కు ఓటమి తప్పలేదు. చివర్లో భువనేశ్వర్ కుమార్(26 నాటౌట్) ధాటిగా బ్యాటింగ్ చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగిక్కు దిగిన ఆసిస్ 5 వికెట్లకు 288 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. పీటర్ హ్యాండ్స్కూంబ్(73), షాన్ మార్ష్(54), ఉస్మాన్ ఖవాజా(59) హాఫ్ సెంచరీలతో పాటు మార్కస్ స్టోయినిస్(47 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆస్ట్రేలియా జట్టు 288 పరుగులు చేసింది.