ఇంగ్లాండ్తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మెరుపు శతకం బాదేశాడు. ఇక టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ టెస్టుల్లో సిక్స్తో మొదటి సెంచరీని చేశాడు. ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో చివరి రోజైన మంగళవారం ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పంత్ కేవలం 118 బంతుల్లో 14×4, 3×6 సాయంతో కెరీర్లో తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు.
వ్యక్తిగత స్కోరు 95 వద్ద స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ బాదిన పంత్ 100 పరుగుల మైలురాయిని అందుకోవడం అతని దూకుడుకి నిదర్శనం. ఇలా టెస్టుల్లో సిక్స్తో తొలి సెంచరీ మార్క్ని అందుకున్న నాలుగో భారత్ క్రికెటర్గా పంత్ తాజాగా నిలిచాడు.
ఇప్పటి వరకు ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ మాత్రమే ఉన్నారు. కెరీర్ తొలి టెస్టులోనూ సిక్స్తో రిషబ్ పంత్ తన పరుగుల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. సిక్స్తో టెస్టుల్లో పరుగులను ప్రారంభించిన పంత్ అదే సిక్స్తో సెంచరీ నమోదు చేశారు,
చివరిదైన ఐదో టెస్ట్లో భారత్ వీరోచితంగా పోరాడుతోంది. ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచి జట్టు విజయం కోసం పోరాడుతున్నారు.రిషబ్ పంత్తో పాటు ఓపెనర్ లోకేశ్ రాహుల్ (142: 210 బంతుల్లో 19×4, 1×6) సెంచరీతో కదం తొక్కడంతో 464 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టు ప్రస్తుతం 298/5తో కొనసాగుతోంది. విజయానికి ఇంకా 166 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి.