భారత వెటరన్ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్.. తన కెరీర్ మొదలు నుంచో ఏదో ఒక వివాదాల్లోకి వెళ్లి విమర్శలు ఎదుర్కుంటునే ఉన్నాడు. అప్పట్లో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ స్టీవ్వాని స్లెడ్జింగ్ చేసిన పార్థీవ్ పటేల్ అతని నుంచి మొట్టికాయలు వేయించుకున్నాడు. తాజాగా మాథ్యూ హెడెన్ ని కూడా తాను స్లెడ్జింగ్ చేసినట్లు పార్థీవ్ పటేల్ బహిర్గతం చేశాడు.
2004లో ఆస్ట్రేలియా పర్యటనకి భారత్ జట్టు వెళ్లగా.. వన్డే మ్యాచ్లో ఆటగాళ్లకి డ్రింక్స్ అందిస్తూ హెడెన్పై స్లెడ్జింగ్కి దిగినట్లు పార్థీవ్ గుర్తు చేసుకున్నాడు. “బ్రిస్బేన్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో ఆటగాళ్లకి నేను డ్రింక్స్ అందించాను. ఆ మ్యాచ్ లో సెంచరీ చేసిన హెడెన్ కీలక టైంలో ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దాంతో అతను పెవిలియన్కి నడుస్తుండగా.. నేను మైదానంలోకి డ్రింక్స్ తీసుకుని వెళ్తూ ’హో హో’ అంటూ అతడిని కవ్వించాను.
అప్పుడు మౌనంగా ఉండిపోయిన హెడెన్.. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూము వద్ద నిల్చొని ‘ఇంకోసారి అలా చేస్తే.. నీ ముఖం పగలగొడతా’ అని వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత అతనికి నేను క్షమాపణలు చెప్పాను” అని పార్థీవ్ పటేల్ చెప్పుకొచ్చాడు. స్టీవ్వాపై అప్పట్లో పార్థీవ్ పటేల్ స్లెడ్జింగ్కి దిగడంతో.. నువ్వు డైపర్లు వేసుకునే వయసులోనే నేను అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ లు అడుతున్నాను. నువ్వు నన్ను స్లెడ్జింగ్ చేస్తున్నావా..? అని అప్పట్లో స్టీవ్వా అతనికి చురకలేశాడు.