భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వన్డేలకి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. సెమీఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ధోని రిటైర్మెంట్పై అసక్తికర చర్చ నడుస్తోంది. వ్యూహాల్లోనే కాదు.. నిర్ణయాల్లోనూ ఎవరి ఆలోచనలు, అంచనాలకి అందని ధోనీ మాత్రం నిన్నటి నుంచి మిన్నకుండిపోయాడు. దీంతో.. తాత్కాలికంగా రిటైర్మెంట్ నిర్ణయానికి బ్రేక్ పడినట్లేనని తెలుస్తోంది.
ధోనీ రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలకు ప్రముఖ సింగర్ లతామంగేస్కర్ స్పందించిన వెంటనె సచిన్ టెండూల్కర్ కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘వన్డేలకి రిటైర్మెంట్ ప్రకటించడం అనేది ధోనీ వ్యక్తిగత నిర్ణయం. కాబట్టి.. ఆ నిర్ణయం తీసుకోవడంపై ధోనీకి అందరూ స్వేచ్ఛనివ్వాలి. అంతేతప్ప.. అనవసరమైన రూమర్లతో అతడ్ని అగౌరవపరచకండి. క్రికెట్ ప్రపంచంలో ఎంత మందికి ఇంత మంచి కెరీర్ ఉంటుంది. టీమిండియాకి సుదీర్ఘకాలంగా ధోనీ అందించిన సేవలు ఏపాటివో..? ప్రస్తుతం అభిమానులు అతడ్ని ఆదరిస్తున్న తీరుతో స్పష్టమవుతోంది. ఇప్పటికీ ఫ్యాన్స్ అతను గొప్ప ఫినిషర్ అని బలంగా నమ్ముతున్నారు. ధోనీ స్వయంగా ఓ నిర్ణయం తీసుకునే వరకూ అతని కథ ముగియదు’ అని సచిన్ వెల్లడించాడు.