హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోని వారికి బల్దియా జరిమానాలు విధిస్తోంది. మాస్కు లేకుండా కస్టమర్లను దుకాణంలోకి అనుమతించినందుకు ఓ దుకాణ యాజమాన్యానికి జరిమానా విధించింది. ఫతేనగర్లోని ఓ స్టీల్ దుకాణ యజమానికి రూ. 2 వేల చలాన్ వేసింది. ప్రజలు బయటకు వస్తే తప్పక మాస్కు ధరించాలని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.
మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ప్రకటనలు ఇస్తూనే ఉన్నా కొందరు ఈ సూచనలను పెడచెవిన పెడుతున్నారు. అవగాహన కల్పించటం వరకే ప్రభుత్వాల బాధ్యత. బయటకు వచ్చిన తర్వాత సోషల్ డిస్టెన్స్ పాటించాలని.. లేదంటే కరోనాని కోరి ఆహ్వానించినట్టే అవుతుందని అంటున్నారు.
మాస్క్లు ధరించని వారిని శిక్షించక తప్పని పరిస్థితి నెలకొంది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతున్నందున అప్రమత్తంగా ఉండాలి. కరోనా నిబంధనలు పాటించటం సామాజిక బాధ్యత. ఇవి పాటించకపోతే… మనం ప్రమాదకారకులమవుతాం.