ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేత ఒకరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. దక్షిణ ఢిల్లీ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడైన జీఎస్ బావా తన ఇంటి సమీపంలోని పార్క్లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జిఎస్ బావా ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
జిఎస్ బావా పశ్చిమ ఢిల్లీలోని ఫతేనగర్లో నివసిస్తున్నారు. నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో పార్కులోని చెట్టుకు విగతజీవిగా వేలాడుతుండడాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జిఎస్ బావా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఆయన వద్ద నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.