ఏఎమ్ రత్నం.. ఈ పేరు వింటే మనకు భారీ చిత్రాలు గుర్తుకొస్తాయి. పేరుకు ఆయన తమిళ సినీ నిర్మాత అయినప్పటికీ తెలుగులో కూడా ఆయన నిర్మించిన మంచి సినిమాలు ఉన్నాయి. ఖుషీ, నాగ, బంగారం, నీ మనసు నాకు తెలుసు, స్నేహం కోసం తదితర సినిమాలను ఏఎమ్ రత్నం నిర్మించారు. ఆయన నుంచి ఎక్కువగా వచ్చేది భారీ చిత్రాలు, అగ్రహీరోల సినిమాలే.
ప్రియురాలు పిలిచింది, 7/జీ బృందావన్ కాలనీ, జీన్స్, ఒకే ఒక్కడు, భారతీయుడు, బాయ్స్ వంటి భారీ చిత్రాలను ఏఎమ్ రత్నం నిర్మించారు. మొదట్లో ఆయన వరుస విజయాలతో ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయన నిర్మించిన భారీ బడ్జెట్ సినిమాలు ఫెయిల్ కావడంతో భారీగా నష్టపోయాడు. నష్టాల్లో ఉన్న ఏఎమ్ రత్నంను హీరో అజిత్ స్వయంగా పిలిచి ఆయనకు వరుసగా ఆఫర్లు ఇచ్చి ఆదుకున్నారు. వేదాళం, ఆరంభం, ఎంతవాడుగాని సినిమాలను వరుసగా ఆయన నిర్మాణంలోనే చేశాడు.
తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏఎమ్ రత్నం ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన నిర్మాణంలో కొన్నేళ్ళ కిందట పవన్ తన దర్శకత్వంలోనే సత్యాగ్రహి అనే సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. ఎందుకో గాని ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కష్టాల్లో ఉన్న ఏఎమ్ రత్నంను పవన్ స్వయంగా పిలిచి సినిమా చేసేందుకు ఆఫర్ ఇచ్చాడు. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న హరిహర వీరమల్లును ఆయనే నిర్మిస్తున్నారు. అయితే కోవిడ్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది.
పవన్ వకీల్ సాబ్ పూర్తయిన తర్వాత పవన్ తిరిగి హరిహర వీరమల్లు సినిమాని పూర్తి చేస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని కూడా భావించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి గ్రాఫిక్ వర్క్ భారీగా ఉండడంతో సంక్రాంతికి విడుదల చేయడం కష్టమని భావించిన పవన్ ముందుగా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అందుకు తగ్గట్లుగానే హరిహర వీరమల్లు సినిమాను పక్కనపెట్టి ముందుగా ఆ సినిమాకు పవన్ డేట్లు ఇచ్చినట్లు సమాచారం. భారీ బడ్జెట్ సినిమా అయిన హరిహర వీరమల్లు ఇప్పటికే పలు కారణాల కారణంగా షూటింగ్ డిలే కాగా పవన్ నిర్ణయంతో ఈ సినిమా నిర్మాణం మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఏఎమ్ రత్నం హరిహర వీరమల్లు జాప్యంవల్ల సినిమా బడ్జెట్ పెరిగి మరింత ఇబ్బందులు పడనున్నారు. నిర్మాతల శ్రేయస్సును కోరుకోవడంలో ఎప్పుడూ ముందుండే పవన్ ఏఎమ్ రత్నంను ఏ విధంగా ఆదుకుంటాడో వేచి చూడాల్సిందే.