దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్య పరిస్థితుల మధ్య, సరైన కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ (PUC/PUCC) లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వబోమని పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా ప్రకటించారు. ఈ నిర్ణయం డిసెంబర్ 18 (గురువారం) నుంచి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.
అలాగే, గురువారం నుంచి ఢిల్లీకి బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల్లో కేవలం BS–VI ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలకే ప్రవేశం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. నిర్మాణ సామగ్రిని తరలిస్తున్న ట్రక్కులపై, అలాగే నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై భారీ జరిమానాలు విధించడమే కాకుండా, అవసరమైతే వాహనాలను సీజ్ చేస్తామని కూడా హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, మంగళవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత కొంత మెరుగుపడింది. సోమవారం 498గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) మంగళవారం 377కు తగ్గింది. అయినప్పటికీ నగరాన్ని పొగమంచు కప్పివేయడంతో దృశ్యమానత తగ్గింది. ఉదయం వేళల్లో ఉష్ణోగ్రత 8.3 డిగ్రీల సెల్సియస్గా నమోదై ప్రజలు చలి వణుకులకు గురయ్యారు.
