మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లోకి వెళ్లిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. సోమవారం జరిగిన ఇష్టాగోష్టిలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాత్రి 9.30 గంటలకు ముఖ్యమంత్రి చిట్చాట్ కార్యక్రమాన్ని తొలిసారిగా చూశానని, అందులో సీఎం, మంత్రులు కేసీఆర్ మరియు బీఆర్ఎస్పై ఎంత భయంతో, నిరాశతో ఉన్నారో స్పష్టంగా కనిపించిందన్నారు. “గాలి మేలు అంటున్నారు… అందాల పోటీలు, ఫుట్బాల్ పోటీలు చేస్తే అభివృద్ధి అవుతుందా?” అంటూ ఎద్దేవా చేశారు.
సచివాలయానికి వెళ్లడానికి కూడా సీఎం వాస్తు భయంతో వెనుకాడుతున్నారని, గేట్లు, మరమ్మత్తులు చేసినా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూసి భయపడి సహకార సంఘాల ఎన్నికలను నామినేటెడ్ పద్ధతిలో నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమైందన్నారు. “రైతులకు నిజంగా మేలు చేసి ఉంటే ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు? దమ్ముంటే ఎన్నికలు నిర్వహించాలి” అని సవాల్ విసిరారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేస్తున్నారని, నీటిపారుదలపై పీపీటీకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ వైఫల్యాలను బయటపెడతామని అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ చెప్పినట్టు 7,000 కోట్లు కాదు, “ఏడు గజాలు కూడా ఇవ్వలేద”ని విమర్శించారు. 20 శాతం కమిషన్ల కోసం బిల్లులు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం కన్సల్టెన్సీ, బ్రోకర్ల ప్రభుత్వంగా మారిందన్నారు.
అప్పుల కోసం బ్రోకర్ల మాట వింటూ భూములు కుదువపెట్టి అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారని, ఇది రాష్ట్రానికి నష్టం కానీ కొందరికి లాభమని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా–ఈ కేసులు రాజకీయ కక్షతో పెట్టినవేనని చెప్పారు. అరెస్టులు, కేసులకు భయపడేది లేదని, కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేసే వరకు పోరాటం ఆగదని హరీశ్రావు స్పష్టం చేశారు.
