నర్సీపట్నంలో రూ.2 కోట్ల నిధుల మళ్లింపు కేసులో టీడీపీకి చెందిన నేత రాజేష్ను సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఆయన 23వ వార్డు కౌన్సిలర్ చంద్రిక భర్త. స్థానికంగా విద్యాసంస్థలు, మద్యం, మంచినీటి సరఫరా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
విద్యాసంస్థల సొసైటీకి చెందిన నిధుల నుంచి దొడ్డిదారిన రూ.2 కోట్లు తన వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో దర్యాప్తు ప్రారంభమైనట్లు తెలిసింది. అంతేకాకుండా, ఈ కేసులో సంబంధిత ఐఆర్ఎస్ అధికారికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించినట్లు కూడా ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో సీబీఐ రాజేష్తో పాటు ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ను కూడా అదుపులోకి తీసుకుంది. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై లోతైన విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటన రాజకీయంగా చర్చకు దారి తీసింది. కూటమి ప్రభుత్వ పెద్దల అండతో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. “మీ కూటమిలో బ్యాంకు రుణాల ఎగవేతదారులే ఉన్నారనుకున్నాం.. ఇలాంటి ఘరానా మోసగాళ్లు కూడా ఉన్నారా?” అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
