“పవన్ కళ్యాణ్ హఠావో” పుస్తక రచయితగా గుర్తింపు పొందిన బొగ్గుల శ్రీనివాస్( Boggula Srinivas) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. 2014లో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశాన్ని విమర్శిస్తూ “పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో” అనే పుస్తకం రచించి అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసిన శ్రీనివాస్, బెదిరింపులు ఎదుర్కొన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఆయన అరెస్టు కూడా అయ్యారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలోని పాలేరు కాలువలోకి ఆయన ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారైన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదమా? లేక మరేదైనా కోణం ఉందా? అనే అంశాలపై అన్ని దిశల్లో విచారణ కొనసాగుతోంది.
