దేశ రాజధాని ఢిల్లీలో రూ.33 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే ఢిల్లీలో రవాణా వ్యవస్థ మరింత వేగవంతం కావడంతో పాటు కాలుష్యం తగ్గి, స్వచ్ఛమైన ప్రజా రవాణా వ్యవస్థకు ఊతం లభిస్తుందని అధికారులు తెలిపారు.
ఢిల్లీ మెట్రోకు చెందిన రెండు కొత్త మార్గాలను ప్రారంభించారు. పింక్ లైన్లోని 12.3 కిలోమీటర్ల మజ్లిస్ పార్క్–మౌజ్పూర్–బాబర్పూర్ కారిడార్ మరియు మ్యాజెంటా లైన్లోని 9.9 కిలోమీటర్ల దీపాలి చౌక్–మజ్లిస్ పార్క్ విస్తరణ మార్గంను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
పింక్ లైన్ విస్తరణతో బురారి, జగత్పూర్-వజీరాబాద్, ఖజూరీ ఖాస్, భజన్పురా, యమునా విహార్ వంటి ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది. మొత్తం 71.56 కిలోమీటర్ల పొడవుతో పింక్ లైన్ పూర్తిగా రింగ్ ఆకారంలో పనిచేయనున్నందున భారతదేశంలో పూర్తి స్థాయి “రింగ్ మెట్రో” కలిగిన మొదటి నగరంగా ఢిల్లీ నిలవనుంది.
ఇక మ్యాజెంటా లైన్ విస్తరణతో నెట్వర్క్ సుమారు 49 కిలోమీటర్లకు చేరుతుంది. మధుబన్ చౌక్, ఉత్తర్ పితాంపురా–ప్రశాంత్ విహార్, హైదర్పూర్ బద్లీ మోర్, భలస్వా వంటి నివాస ప్రాంతాలు మెట్రో ద్వారా అనుసంధానమవుతాయి. దీంతో ఉత్తర–తూర్పు మరియు ఉత్తర–పడమర ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
ఇదే కార్యక్రమంలో ఫేజ్ V-A కింద 16.1 కిలోమీటర్ల పొడవైన మూడు కొత్త మెట్రో కారిడార్లకు కూడా శంకుస్థాపన చేశారు. రామకృష్ణ ఆశ్రమ మార్గ్–ఇంద్రప్రస్థ సెంట్రల్ విస్టా మార్గం, ఏరోసిటీ–ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 మార్గం, తుగ్లకాబాద్–కాలిందీ కుంజ్ మార్గాలు ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయి.
ఈ మార్గాలు అమలులోకి వస్తే ఫరీదాబాద్, బల్లభ్గఢ్, నోయిడా వంటి ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి చేరుకోవడం మరింత సులభమవుతుంది.
మెట్రో ప్రాజెక్టులతో పాటు సరోజిని నగర్, నేతాజీ నగర్, కస్తూర్బా నగర్, శ్రీనివాసపురి ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న జీపీఆర్ఏ కాలనీల అభివృద్ధి పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. సుమారు రూ.15,200 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. దీని ద్వారా 9,350 ఆధునిక ఫ్లాట్లు, 48 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. 2025–26 బడ్జెట్లో రవాణా శాఖకు రూ.9,110 కోట్లు కేటాయించగా, అందులో రూ.2,929 కోట్లు మెట్రో అభివృద్ధికి కేటాయించారు. ఈ చర్యల ద్వారా ఆధునిక, సమగ్ర రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడమే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు తెలిపారు.
