పద్మావతి చిత్రంపై వివాదాలు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఆ చిత్రం ప్రకటించిన నాటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. బాలీవుడ్ లో పేరు మోసిన దర్శకుడు సంజయ్లీలా బన్సాలీపై, చిత్ర బృందంపై దాడులు కూడా జరిగాయి. ఇటీవల ఓ విలేకరుల సమావేశంలో ఆ చిత్ర ప్రధాన పాత్రధారి, హీరోయిన్ దీపికా పదుకొనె ఎవరెన్నీ అడ్డంకులు సృష్టించినా సినిమా ఆగదని ప్రకటించింది. ఈ ప్రకటన అగ్గికి ఆజ్యం పోసిన మాదిరి ఆ వివాదాలు మరింత రాజుకున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆమెను చంపితే రూ.5 కోట్లు ఇస్తామని ఓ నాయకుడు ప్రకటించాడు. పద్మావతి సినిమాపై ప్రస్తుతం కర్ణిసేన ఆవేశాలు హద్దులు దాటుతున్నాయి.
సంజయ్ లీలా బన్సాలీపై అలాగే ఆ సినిమాలో నటించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలను కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీపిక ముక్కును కోసేస్తమని ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన విడుదలకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ సమయంలో కర్ణిసేన ఈ వివాదాస్పద ప్రకటన ఇచ్చారు. దీపికను చంపేస్తే రూ.5 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. థియేటర్స్లో సినిమా ఆడితే తగలబెట్టేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం కూడా ఈ సినిమా ఈ సమయంలో విడుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఓ సంస్థ నాయకులు డిసెంబర్ 1వ తేదీన భారత్ బంద్ను ప్రకటించారు. ఆ రోజు భారత్ బంద్ చేసి సినిమాను ఆడుకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభంలోనే సినిమా సెట్స్ తగలబెట్టడం, నటీనటులపై దాడులు జరిగాయి. ఇప్పుడు 1 తారీఖు ఏమవుతుందోనని అందరూ టెన్షన్ పడుతున్నారు.