ఏదో ఒక విషయంలో విజయవాడ కనకదుర్గమ్మవారి గుడి వివాదాల్లోకి ఎక్కుతోంది. మొన్నామధ్య ఆలయంలో క్షుద్రపూజలు చేశారంటూ ఆరోపణలు రాగా.. తాజాగా అమ్మవారి పట్టుచీర మాయమైంది. ఇది కూడా పెద్ద వివాదానికి దారితీసింది. దీంతో.. వెంటనే ప్రభుత్వం దీనిపై చర్యలకు శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా ఆలయ ఈవో పద్మపై బదిలీ వేటు వేసింది. ఆమె స్థానంలో ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను నియమించింది. అమ్మవారి చీర మాయం కేసులో పాలకమండలి సభ్యురాలు సూర్యలత ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆమెను ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించింది.
విధుల్లో చురుగ్గా ఉండకపోవడంతోనే పద్మను బదిలీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆలయ ఈవోతో పాటు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా పద్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారనీ, దీంతో ఆమె గందరగోళానికి గురి అవుతున్నారని తెలిపాయి.
ఆమధ్య దుర్గ గుడిలో క్షుద్ర పూజల వివాదం తలెత్తడంతో ఆలయ ఈవోగా ఉన్న ఐఏఎస్ అధికారిణిని తొలగించిన ప్రభుత్వం.. పద్మను ఈవోగా నియమించింది. తాజాగా చీర మాయం వివాదంతో పద్మ స్థానంలో ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను ఈవోగా నియమించింది. పద్మ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా కొనసాగుతారు.
