వందగొడ్లను తిన్న రాబందు.. ఒక్క గాలి వానకు చచ్చినట్టు ఉంది టీమ్ ఇండియా పరిస్థితి. విజయాల పరంపర కొనసాగిస్తున్న టీమ్ ఇండియా.. న్యూజిలాండ్తో జరిగిన నాల్గో వన్డేలో చిత్తుచిత్తుగా ఓడింది. న్యూజిలాండ్కు ఏమాత్రం పోటీ ఇవ్వని భారత్ ఘోర పరాజయాన్నితన ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్ ముందుంచిన 93 పరుగల లక్ష్యాన్ని 14.4 ఓవర్లలో ఛేదించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో రాస్ టేలర్ 37, నికోలస్ 30 రన్స్ చేసి నాటౌట్గా నిలిచారు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్కు ఈ విజయం పెద్ద ఊరట.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత బ్యాట్స్మెన్లు దారుణంగా విఫలమయ్యారు. 30.5 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటయ్యారు. కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్(5/21), గ్రాండ్ హోమ్(3/26) బౌలింగ్ దెబ్బకు భారత బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో తొమ్మిదేళ్ల అనంతరం అత్యల్ప స్కోర్కు ఆలౌటై చెత్త రికార్డును నెలకొల్పింది. అది కూడా 2010లో దంబుల్లా వేదికగా న్యూజిలాండ్(88) పైనే ఈ రికార్డు ఉంది. కాగా, న్యూజిలాండ్లో భారత్కు ఇదే అత్యల్ప స్కోరు.
ఇండియన్ బ్యాట్స్మెన్లో ధావన్(13),పాండ్యా(16) చహల్(18), కుల్దీప్(15)లు మాత్రమే రెండంకెల స్కోరును చేయడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. రాయుడు(0), కార్తీక్(0)లు గ్రాండ్ హోమ్ బౌలింగ్లో వెంటవెంటనే ఔటయ్యారు. ఎన్నో అంచనాల మధ్య అరంగేట్రం చేసిన శుబ్మన్ గిల్(9) కూడా పూర్తిగా నిరాశ పరిచాడు. ఇక చివరిదైన ఐదో వన్డే ఫిబ్రవరి 3వ తేదీన జరగనుంది.