త్వరలో ఆరంభం కానున్న వరల్డ్ కప్కు భారత్ సిద్దమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత జట్టుకు మరమ్మత్తులు చేయడం ప్రారంభించింది టీమ్ మేనేజ్ మెంట్. టీమిండియాను ఎంపిక చేయడానికి పెద్ద కసరత్తే చేస్తోంది. ఏప్రిల్ 23లోపు టీమ్ను ప్రకటించాల్సి ఉండటంతో సెలక్టర్లు ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఒకవైపు యువ ఆటగాళ్లను పరీక్షిస్తూనే వారి బ్యాటింగ్ ఆర్డర్పై కూడా ఒక కన్నేసి ఉంచింది.
ఒకటి, రెండు స్థానాలు తప్ప ఇప్పటికే దాదాపు అన్ని బెర్తులు ఖరారయ్యాయని ఇప్పటికే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ముగ్గురి పేర్లను పరిశీలించే పనిలో ఉన్నారు. దీనిలో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మూడు టీ20ల సిరీస్ను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ధోనీ వారసుడిగా గుర్తింపు పొందిన రిషబ్ పంత్తోపాటు ఆల్రౌండర్ విజయ్ శంకర్, టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే పేర్లు కూడా వరల్డ్ కప్ రేసులో ఉన్నారు.
పంత్ ఇప్పటికే ఇంగ్లండు, ఆస్ట్రేలియాల లాంటి కఠినమైన పరిస్థితుల్లో రెండు సెంచరీలు కూడా చేశాడు. ఇక విజయ్ శంకర్ విషయానికి వస్తే న్యూజిలాండ్తో సిరీస్లో నంబర్ 3లో బ్యాటింగ్కు వచ్చిన శంకర్ బాగా రాణించారు. మూడో టీ20లో టీమ్ ఓడినా.. విజయ్ మాత్రం 28 బంతుల్లోనే 43 పరుగులు చేయడం విశేషం.
ఏడాది కిందట సౌతాఫ్రికాతో చివరిసారి వన్డే మ్యాచ్ ఆడిన రహానే పేరును కూడా మూడో ఓపెనర్గా పరిశీలిస్తున్నామని చెప్పి ఆశ్చర్యపరిచాడు. దేశవాళీ క్రికెట్లో రహానే బాగా రాణిస్తున్నాడని, అందుకే వరల్డ్కప్ టీమ్ రేసులో అతనూ ఉన్నాడని ప్రసాద్ తెలిపాడు. ముగ్గురిలో ఎవరు వరల్డ్ కప్ రేసులో ఉంటారో చూడాలి.