నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎన్ఎస్ఎప్ అధ్యక్షుడు తిరుమలనాయుడిపై ఆదివారంనాడు వైసీపీ వర్గీయులు దాడి చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. సోమవారం నాడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం ముందు ఆయన భార్య, కుటుంబసభ్యులు ధర్నా చేశారు. దీందో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుమలనాయుడిపై దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వివరణ ఇచ్చారు.
తనపై టీడీపీ నేతలే విషప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. తాను టీడీపీ నేతలను ఎప్పుడూ బెదిరించలేదని స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు తిరుమల నాయుడుతో తనకు ఎటువంటి శత్రుత్వం లేదని పేర్కొన్నారు. తిరుమల నాయుడుపై దాడి జరిగిన వెంటనే టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర తనపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా కార్యాలయంపై దాడి చేయడం మంచిపద్దతి కాదన్నారు.