పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సినిమాలు సంతృప్తి ఇవ్వలేదని చెప్పారు. బోస్టన్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న ఇండియా కాన్ఫెరెన్స్ 2017లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడేందుకు మూడురోజుల క్రితం పవన్ అమెరికా వెళ్లారు. అక్కడ పలు సమావేశాల్లో పాల్గొన్న అయన నిన్న న్యూ హ్యామ్ షైర్ లోని నౌషలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కొన్ని నిముషాల పాటు ప్రసంగించారు.
తాను నటించిన చిత్రాలు ఎంత విజయం సాధించినా సంతృప్తి లేదని, ప్రజలకు సేవ చేయడంలోనే ఆనందం ఉందని తెలిపారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేననని చెప్పారు. వారికి మంచి చేయాలనే రాజకీయంలోకి అడుగు పెట్టానని, అధికారం కోసం కాదని స్పష్టం చేశారు. జనసేన పార్టీని తన సొంత డబ్బులతోనే నడిపిస్తానని, ఒకవేళ అవసరమై ఎవరినుంచి అయినా ఫండ్ తీసుకుంటే ప్రతి పైసాకి లెక్కలు చూపిస్తానని పవన్ వెల్లడించారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన అయన ప్రసంగాన్ని భారత్ మాతాకీ జై.. జై హింద్ అని ముగించారు.
Related