సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని మెగాస్టార్ చిరంజీవి దాకా అందరి సినిమాల్లో నటించి మెప్పించిన ఎవర్ గ్రీన్ హీరోయిన్ జయప్రద ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 1990 సంవత్సరం తర్వాత సినిమాలు తగ్గించిన జయప్రద ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. రాజకీయాల్లో పూర్తిస్థాయి బిజీ అయిపోయారు. ఆ తర్వాత సినిమాలు చేయలేదు.
ఆ పార్టీ ఈ పార్టీ అంటూ మారిపోయి రాజకీయాల్లో రాణించలేక ఇక సినిమాల వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రసు్తతం ఓ మలయాళ సినిమాలో జయప్రద నటిస్తున్నారు. ఇన్నాళ్ల తర్వాత మంచి కంటెంట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘కినర్’ తమిళంలో, ‘కెని’ పేరుతో మళయాలంలో సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నిశద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సరిహద్దు రాష్ట్రాల్లో ఉండే నీటి సమస్య ఇతివృత్తంగా తీస్తున్నారు.
ఈ సినిమాలో తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకున్న కేరళ మహిళగా జయప్రద కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నాజర్, రేవతి, రేఖ, పార్తిబన్, అర్చనలాంటి నటీనటులు నటిస్తున్నారు. 27 ఏళ్ల కిందట దళపతి సినిమా కోసం కలిసి పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం, యేసుదాసు మళ్లీ ఈ సినిమా కోసం ‘అయ్యా సామీ’ అంటూ కలిసి పాట పాడారు. ఇటీవల విడుదలైన పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. జయచంద్రన్ సంగీత దర్శకత్వంలో ఉన్న ఈ సినిమా తెలుగులో విడుదలవుతుందో లేదో చూడాలి.