గాన కోకిలా స్వరం శాశ్వతంగా మూగబోయింది. ప్రముఖ గాయని, భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ముంబయి బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె అభిమానులను శోకసముద్రంలో ముంచి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. 30కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో వేలాది గీతాలను ఆలపించారు. అత్యధికంగా హిందీ, మరాఠీ భాషల్లో ఆమె పాటలు పాడారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్ స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకొన్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. అయితే శనివారం మరోసారి ఆమె ఆరోగ్యం క్షీణించింది. మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. లతా మంగేష్కర్.. 1929 సెప్టెంబరు 28న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించారు.
ప్రముఖ థియేటర్ యాక్టర్, క్లాసికల్ సింగర్ అయిన పండిట్ దీనానాథ్ మంగేష్కర్, షీవంతి దంపతులకు లతామంగేష్కర్ మొదటి సంతానం. ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్, మీనా కదికర్లు లత మంగేష్కర్కు తోబుట్టువులు. ఐదేళ్ల వయసులోనే తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు.⦁ 13 ఏళ్ల వయసులో తండ్రి మరణం తర్వాత సినీ రంగంలోకి 1942లో నేపథ్య గాయనిగా ప్రవేశించారు. లత మంగేష్కర్ తొలిసారి ఓ మరాఠీ చిత్రంతో నేపథ్య గాయనిగా మారారు. అయితే, ఆ పాట సినిమా నుంచి తొలగించారు. 1942లో కిటీ హసాల్’ కోసం ఆమె పాడిన పాటను ఎడిటింగ్లో తీసేశారు. ‘మహల్'(1949) సినిమాలోని ఆయేగా ఆనే వాలా పాటతో లతా కెరీర్ మలుపు తిరిగింది. సొంత నిర్మాణ సంస్థలోని తెరకెక్కించిన ‘లేఖిని’ సినిమాలోని పాటతో జాతీయ అవార్డు లతాను వరించింది. 1948-78 మధ్య 30 వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు.
మొత్తంగా 980 చిత్రాలకు గాత్రాన్ని అందించారు. 36 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. 1969లో పద్మభూషణ్, 1999లో పద్మ విభూషణ్, 2001లో భారతరత్న పురస్కారాలు సొంతం చేసుకున్నారు లతా మంగేష్కర్. కె.ఎల్.సైగల్ పాటలంటే తనకు చాలా ఇష్టమని లతా మంగేష్కర్కు పలు సందర్భాల్లో చెప్పారు. 1963 భారత్-చైనా యుద్ధ సమయంలో లతా పాడిన అయే మేరే వతన్ కే లోగో పాట విని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 1974లో లండన్లోని రాయల్ ఆల్బర్డ్ హాల్లో సంగీత కచేరీ నిర్వహించారు లతా మంగేష్కర్. భారతీయ నేపథ్య గాయకుల రాణి అని లతా మంగేష్కర్ గురించి టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కథనాన్ని ప్రచురించింది.