పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ అక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను భారత వాయిసేన ధ్వంసం చేయడంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాలు యుద్ధానికి కూడా సై అంటున్నాయి. ఇలాంటి సమయంలో ఇరు దేశాల నాయకులతో పాటు సెలబ్రిటీల మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తోంది. పాక్ చెరలో ఉన్న భారత వింగ్ కమాండర్ దేశానికి తిరిగి రావాలని దేశ ప్రజలు కోరుకుంటంటే పాక్ ప్రముఖ నటి వీణామాలిక్ తమ దేశ సైన్యాన్ని పొడుగుతూ, భారత్ ఆర్మీని విమర్శిస్తూ ట్విటర్లో కామెంట్లు, ఫొటోలు పెట్టి వివాదాస్పద ట్వీట్ చేసింది. ‘మీరు ఇప్పుడిప్పుడే వచ్చారు…. మీకు ఆతిథ్యం బాగుంటుంది..’’ అంటూ తన ట్విట్టర్ వేదికగా వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. వీణా మాలిక్ ట్విట్కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది బాలీవుడ్ నటి స్వరభాస్కర్ .
‘‘వీణా జీ… మీ సంకుచితమైన బుద్ధికి నేను సిగ్గుపడుతున్నాను.. మీ ఆనందం క్షణికమే. మా ఆఫీసర్ హీరో, ధైర్య సాహసాలు కలిగిన జవాన్’’ అని ట్వీట్ చేశారు. అభినందన్ని పాక్ జవాన్లు అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా ఆయన ముఖంలో ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదని స్వర భాస్కర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.